కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచన
గోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర పరిస్థితిగా గుర్తింపు
శబ్ద కాలుష్య నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టీకరణ
నెల్లూరు 'వైట్ కేటగిరి' పరిశ్రమల కాలుష్యంపై విచారణకు ఆదేశం
దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కేవలం నివేదికలకే పరిమితం కావొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీసీబీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనిఖీ ప్రక్రియలో పారదర్శకత కోసం బాధితులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలతో సహా ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని, ఎవరికీ మినహాయింపులు లేవని తేల్చిచెప్పారు. కొన్ని పరిశ్రమలు చట్ట ప్రకారం గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గోస్తనీ నది తీవ్రంగా కాలుష్యమైందని, అక్కడ పర్యావరణ అత్యవసర పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలను డ్రోన్లు, వీడియో కెమెరాల ద్వారా గుర్తించి బాధ్యులను చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో 'వైట్ కేటగిరి' కింద నమోదైన కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయన్న ఫిర్యాదులపై విచారణ జరపాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 13 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' కింద కేటాయించిన రూ.400 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పీసీబీలో సిబ్బంది కొరతపై అధికారులు ప్రస్తావించగా, నియామకాల ఫైలును వెంటనే ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Pawan Kalyan
Andhra Pradesh
Deputy CM
Pollution Control
PCB
Environmental Protection
Green Belt
Noise Pollution
Gosthani River
National Clean Air Program

More Telugu News